Pages

Vinayaka Puja Vidhanam in Telugu

Vinayaka Vratam
Vinayaka Vratam
Vinayaka Pooja vidhanam in Telugu, Vinayaka Vrata Vidhanam, Vinayaka Pooja Vidhi, Vinayaka Vratakalpam, Ganesh Chaturthi Puja

(పురుష సూక్త విధానముగ షోడశోపచారములతో ఏర్పరచిరి. నిత్యము గణపతిని పూజించువారి నుద్ధేశించి ఈ విధాన మందింపబడినది.)

వినాయక చవితి సందర్భముగ చేయు పూజకు "ఓం శ్రీ మహా గణాధిపతయే నమః" అనుటకు బదులుగ ఉపచారములు చేయునపుడు "ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః" అనిగాని "ఓం శ్రీ సిద్ధి వినాకాయ నమః" అనిగాని సంభోదించవచ్చును. మహా గణపతి ప్రధాన దైవము. విఘ్నేశ్వరుడు, వినాయకుడు, యోగ గణపతి, బాల గణపతి, దుర్గా గణపతి, శుభదృష్టి గణపతి, గణపతి రూపాంతరములే. అందుచే " మహా గణాధిపతయే నమః " అనునది నిత్యపూజకు సమంజసము. ప్రత్యేకపూజలకు ప్రత్యేక నామములనువాడవచ్చును. గణపతి రూపమును బట్టి నామ ముండును.కావున ఏ రూపమును ధ్యానించువారు ఆ రూప సంబందిత నామముతో పూజ చేసుకోవచ్చును.)

Ashamsanam (!! ఆశంసనము !! )

సిద్ధివినాయకపూజ సుప్రసిద్ధము.సర్వ శుభప్రదము.
ఈ పూజ విధానమును సమగ్రముగ అందించుటకే ఈ మా ప్రయత్నము.
విఘ్నములు తొలగుటకు విఘ్నేశ్వరుని ప్రార్థించుట సంప్రదాయము.
మానవుల జీవితంలో కొన్ని ప్రయత్నములు ఫలించును, కొన్ని ఫలించవు.
అట్లు ఫలించకుండుట వలననే ఒక్కొక్కసారి మానవునికి ఎదురుదెబ్బలు తగులుచుండును.
ఇలాంటి సమయమున మనము దైవప్రార్థనలు చేయుట వివేకము.
విఘ్నములు లేని దైవం మన సిద్ధివినాయకుడే, అట్టి సిద్ధినిచ్చు దైవముగా గణేశుని ప్రార్థంపవలెను.
ఇట్లు శుభసంకల్పములను చేసుకొన్నవారికి కాలము, ధనము,శ క్తివ్యయముగాక, జీవితము సర్వమూ సద్వినియోగ మగును.
విఘేశ్వరునకు శక్తి నిచ్చునది అమ్మవారు.శరీరముకూడ ఆమెయే ఒసగినది.బ్రహ్మజ్ఞానమును తండ్రి యెసగెను.
అదియే వినాయకుని తలమార్పిడి కథగా తెలియదగును.మరియు,శక్తివంతుని కన్న
ఆత్మవంతుడు బలవంతుడని కూడ వినాయకుని కథ తెలియ జేయును.
వినాయకుని పెద్ద చెవులు--మాటాడుటకన్న వినుట నేర్చుకొమ్మని సందేశమిచ్చును. గజముఖము--జ్ఞానమునందు అసక్తి గొనుమని సూచించును.
తోండము -- నీవు ఓంకారస్వరూపుడవని గుర్తుచేయుచుండును. మూషిక వాహనము కౌశలమునకు సూచన.
ఎంత తెలిసినవాదైననూ కౌశలముతో పనిచేయనిచో కార్యసిద్ధి కలుగదని సూచన.
తెలివికి సద్గుణముల సాన్నిధ్యము,అటులనే సద్గురువులకు తెలివి దాస్యము చేయుట
వినాయకుడు -- అతని వాహనము మనకు సూచించుచున్నది.
వినాయకునకు వాహనముకాని ఎలుక,కేవలము తెలివిని స్వార్థమునకు, దొంగతనమునకు ఉపయోగించుకొనుచుండును.
లౌకికజీవులలో తెలివిగల వారందరూ నిట్టివారే. అతితెలివికి సద్గుణముల బలము చేర్చినచో, వారి తెలివి లోక కల్యాణమునకు ఉపకరించును.
మూషికము వినాయకుని వాహనముగా నేర్పడినది.అటులనే మానవుని తెలివియను మూషికము మానవునందలి దైవప్రజ్ఞకు లోబడి యుండవలెను.
వినాయకుని బొజ్జ -- జీవితంలో పుష్టి నేర్పరచుకొనుమని బోధించును.చేతిలో ఉండ్రాయి తుష్టిని బోధించును. ఇట్లనేక రకములుగా వినాయకుని రూపము మానవులకు ఆరాధ్యసంకేతముగా ఋషులేర్పరచినారు.

అవగాహనముతో చేయుపూజ మిక్కుటముగా రాణించగలదు. కావున ఈ విషయములు తెలియజేయు చున్నాము.
అటులనే శక్తివంతుడగు కుమారస్వామి ప్రజ్ఞకన్న దైవమునందు భక్తిగొన్న ఆత్మవంతుడగు వినాయకుని ప్రజ్ఞ మిన్నయని వారిరువురి కథ కూడ రూపించబడినది.

వినాయకుని జీవిత సన్నివేశము అన్నియు యిట్టి ప్రత్యేక సందేశములతో నిండివున్నవని పాఠకులు గమనించగలరు.

భారతీయ సంస్కృతిలో యిట్టి సంకేతము లెన్నియో ఋషులందించినారు.
జిజ్ఞాసులగు జీవులు వీనిలోనికి తోంగిచూచినచో, అపారమైన జ్ఞానసంపద లభింపగలదు.భారతీయులుగా ఇది మన కర్తవ్యము.

అందరినీ వారివారి కుటుంబములను శ్రీ మహాగణపతి ఆయురారోగ్య ఐశ్వర్యముల నిచ్చి సత్త్య మార్గమున నిలుపవలెనని ప్రార్థిస్తూ.......


!!శ్రీ వినాయక వ్రతకల్పము !! (Vinayaka Vratakalpam)

(పసుపుతో విఘేశ్వరుని చేసి,తమలపాకులో నుంచి,తమలపాకు చివర తూర్పు వైపునకుగాని,ఉత్తరము వైపునకు గాని ఉండునట్లు వుంచవలెను. ఆ తమలపాకును ఒక పళ్ళెములో పోసిన బియ్యముపై నుంచవలెను. అగరవత్తులు వెలిగించి దీపారాధన చేసి తరువాత ఈ క్రింది స్లోకములను చదువవలెను.)

ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి
సానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగ స్మానుప సుష్టుతైతు
అయం ముహూర్త స్సుముహూర్తో ௨స్తు

శ్లో య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా
తయో స్సంస్మరణా త్పుంసాం సర్వతో జయమంగళం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్మ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే

తదేవలగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ
లక్ష్మీపతే తే௨0ఘ్రియుగం స్మరామి

యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్థరః
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతి ర్మతి ర్మమ

స్మౄతే సకలకళ్యాణ భాజనం యత్ర జాయతే
పురుషంత మజం నిత్యం వ్రజామి శరణం హరిమ్మ్

సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషా మమంగళమ్మ్
యేషాం హృదిస్థో భగవాన్మంగళాయ తనం హరిః

లాభస్తేషాం,జయ స్తేషాం కుత స్తేషాం పరాభవః
యేషా మిందీవరశ్యామో హృదయస్థో జనార్ధనః

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్మ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్మ్

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమో௨స్తుతే

( విఘేశ్వరునిపై అక్షంతలు వేయుచు నమస్కరించుచూ )

శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః--ఉమామహేశ్వరాభ్యాం నమః--వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః--
శచీపురందరాభ్యాం నమః--ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః--అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః--సీతారామాభ్యాం నమః--మాతాపితృభ్యాం నమః--సర్వేభ్యో మహాజనేభ్యో నమః.

 Achamanam (ఆచమనం )

ఓం కేశవాయ స్వాహా -- ఓం నారాయణ స్వాహా -- ఓం మాధవాయ స్వాహా --

( ఈ మూడు నామములు చదువుచు మూడుసార్లు నీటితో ఆచమనం చేయవలెను )

గోవిందాయ నమః , విష్ణవే నమః , మధుసూధనాయ నమః , త్రివిక్రమాయ నమః , వామనాయ నమః , శ్రీధరాయ నమః , హృషీకేశవాయ నమః , పద్మనాభాయ నమః , దామోదరాయ నమః , సంకర్షణాయ నమః , వాసుదేవాయ నమః , ప్రద్యుమ్నాయ నమః , అనిరుద్ధాయ నమః , పురుషోత్తమాయ నమః , అధోక్షజాయ నమః , నారసింహ్మాయ నమః , అచ్యుతాయ నమః , జనార్థనాయ నమః ఉపేంద్రాయ నమః , హరయే నమః , శ్రీ కృష్ణాయ నమః .

( నీటిని పైకి,ప్రక్కలకు,వెనుకకు,జల్లుచూ )

ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మ ఖర్మ సమారభే

( ప్రాణాయామము ) Pranayamam

ఓం భూః , ఓం భువః , ఓగ్ం సువః , ఓం మహః , ఓం జనః , ఓం తపః , ఓగ్ం సత్యమ్మ్ , ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్
ఓ మాపో జ్యోతీ రసో௨మౄతం , బ్రహ్మ భూర్భువస్సువరోమ్మ్ .

( సంకల్పము ) Sankalpam

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం , శుభే శోభననే ముహూర్తే , శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య, అద్యబ్రహ్మణః , ద్వితీయ పరార్థే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే భరతఖండే, మేరో ర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన ప్రదేశే, శోభన గృహే, సమస్త దేవతా భ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిదౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ......నామ సంవత్సరే...... ఆయనే...... ఋతౌ...... మాసే...... పక్షే...... తిథౌ...... వాసరే...... శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్...... గోత్రోద్భవః..... (మీ గోత్రం చెప్పుకోవాలి) నామధేయస్య, ధర్మపత్నీసమేతః, (మీ భార్యపేరుతో మీ పేరు కలిపి చెప్పుకోవాలి). మమ సకుటుంబస్య, క్షేమ, స్త్ధెర్య విజయ అభయాయురారోగ్యైశ్వర్యాభి వృద్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్యర్థం, పుత్ర పౌత్రాభి వృద్ద్యర్థం, సర్వాభీష్ట సిద్ధార్థం, లోకకళ్యాణార్థం శ్రీ విఘ్నేశ్వర పూజాం కరిష్యే .

అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం ,శ్రీ విఘ్నేశ్వర పూజాం కరిష్యే .

తదంగ కలశారాధనం కరిష్యే .

( కలశంలో గంధం,పుష్పం,అక్షతలు,వేసి,కుడిచేతితో కలశముపై మూసి )

కలశస్యముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మ , మధ్యే మాతృగణా స్మృఅతాః

కుక్షౌతు సాగరాఃసర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదో௨ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆ కలశేషుదావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్త్ధెర్య జ్ఞేషువర్థతే
అపోవా ఇదగ్ం సర్వం విశ్వా భూతా న్యాపః , ప్రాణావా ఆపః ,
పశవ ఆపో௨న్నమాపో ௨ మృతమాప , స్సమ్రాడాపో ,విరాడాప , స్స్వరాడాప ,
శ్ఛందాగ్ంష్యాపో , జ్యోతీగ్ం ష్యాపో , యుజూగ్‌ష్యాప స్సత్యమాపస్సర్వా దేవతా ఆపో భూర్భువస్సువ రాప ఓమ్మ్

( ఈ క్రింది శ్లోకములు చదివి , శుద్ధోదకమును దేవునిపై,తనపై,పూజా సామగ్రిపై చల్లవలెను )

గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదా సింధు కావేరీ జలే௨స్మిన్ సన్నిధిం కురు

కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమీ
భాగీరధీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః

ఆయాస్తుమమదురితక్షయ కారకాః శ్రీ విఘ్నేశ్వర పూజార్థం శుద్ధోదకేన దేవం ,ఆత్మానం , పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య

( ప్రాణ ప్రతిష్ట ) Prana Pratista

పసుపు విఘ్నేశ్వరునిపై కుడిచేతిని యుంచుచూ , ఈ క్రింద మంత్రమును చదువవలెను.)

ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో ధేహిభోగం
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంతం
అనుమతే మృడయానః స్వస్తి
అమృతం వైప్రాణా అమౄతమాపః ప్రాణానేవ యధాస్తాన ముపహ్వయతే
శ్రీ విఘ్నేశ్వరాయ నమః స్థిరోభవ వరదోభవ సుముఖో భవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు

పూజా ప్రారంభం  (Starting of Vinayaka Chavithi Pooja)

Shodashopachara Puja 

( పూర్వోక్తఏవంగుణ విశేషణ విశిష్టాయాం...గోత్రః....నామధేయః....అహం శ్రీ సిద్ధి వినాయక పూజాం కరిష్యే.)

ధ్యానం ::

శ్లో భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణా
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే

శ్లో ఏక దంతం శ్శూర్ప కర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశ ధరం దేవం ధ్యాయేత్‌ సిద్ధి వినాయకం

శ్లో ఉత్తమం గణనాధస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభీష్ట ప్రదం తస్మాత్‌ ధ్యాయేత్‌ విఘ్ననాయకం

శ్లోధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం
చర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం

Avahanam ఆవాహయామి ::>

సహస్రశీర్‌షా పురుషః
సహస్రాక్ష స్సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట ద్దశాంగుళం

శ్లో అత్రాగచ్చ జగద్వంద్య - సుర రాజార్చి తేశ్వర
అనాధ నాధ స్సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవా
శ్రీ మహా గణాధిపతయే నమః ఆవాహనం సమర్పయామి.

Asanam ఆసనం:: >>

పురుష ఏ వేదగ్ం సర్వం య ద్భూతం యచ్చభవ్యం
ఉతామృతత్వ స్యేశానః య దన్నే నాతిరోహతి

శ్లో మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్న విరాజితం
రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం
శ్రీ మహా గణాధిపతయే నమః సింహాసనం సమర్పయామి అంటూ అక్షతలు చల్లాలి.

Padyam పాద్యము :: >>

ఓం కపిలాయ మనః
ఏతావానస్య మహిమా అతో జ్యాయాగ్ంశ్చ పురుషః పాదో௨స్య విశ్వాభూతాని త్రిపా దస్యా௨మృతం దివి
శ్లో గజవక్త్రం నమస్తుభ్యం సర్వాభీష్ట ప్రదాయకం
భక్తా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
శ్రీ మహా గణాధిపతయే నమః పాద్యం సమర్పయామి అంటూ నీటిని వదలాలి.

Argyam అర్ఘ్యము :: >>

 ఓం గజకర్ణకాయ నమః
త్రిపా దూర్ధ్వ ఉదై త్పురుషః పాదో௨స్యేహాభవా త్పునః
తతోవిష్వ ఙ్య్వక్రామత్ సాశనానశనే అభి

శ్లో గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన
గృహాణర్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షితైర్యుతం

శ్రీ మహా గణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి అంటూ ఉద్దరిణతో నీటిని తీసుకొని వదలాలి.

Achamaneeyam ఆచమనీయము :: >>

ఓం లంబోదరాయ నమః
తస్మా ద్విరా డజాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చ ద్భూమి మధో పురః

శ్లో అనాధ నాధ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత
గృహాణచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో
శ్రీ మహా గణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి అంటూ నీటిని వదలాలి.

Madhuparkam మధుపర్కం ::>>

శ్లో దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం
మధుపర్కం గృహేణేదం గజవక్త్ర నమోస్తుతే
శ్రీ మహా గణాధిపతయే నమః మధుపర్కం సమర్పయామి

Panchamrutha Snanam పంచామృత స్నానము::>>

ఓం వికటాయ నమః

యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞ మతన్వత వసంతో అస్యసీ దాజ్యం గ్రీష్మ ఇద్మ శ్శరద్ధవిః

(With Milk) పాలతో::>>
ఆప్యాయస్వ సమేతుతే విశతస్సోమవృష్టియం భవావాజస్య సంగధే క్షీరేణ స్నపయామి
(With Curd) పెరుగుతో::>>
దధిక్రావ్‌ణ్ణో అకారిషం జిష్ణొరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ర్పణ ఆయుగ్ంషి తారిషత్ దధ్నా స్నపయామి
(With Ghee) నేతితో::>> శుక్రమసి జ్యోతిరసి తేజో௨సి దేవోవస్సవితో త్ప్నా త్వఛ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యస్య రశ్మిభిః ఆఙ్యేన స్నపయామి
(With Honey) తేనెతో::>> మధువాతా ఋతాయతే మధిక్షరంతి సింధవః మాధ్వీర్న స్సంత్యోషధీః మధునక్త ముతోషసి మధుమత్పార్థివగ్ం రజః మధుద్యౌరస్తునః పితా మధుమాన్నో వనస్పతి ర్మధుమాగ్ం అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతునః మధునా స్నపయామి .
(With Sugar) శర్కరతో::>> స్వాధుఃపవస్య దివ్యయ జన్మనే స్వాదురింద్రాయ సుహావీతునామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్ం అదాభ్యః శర్కరయా స్నపయామి .
(With Plain Water) శుద్ధోధకముతో::>> అపోహిష్ఠా మయోభువఃతాన ఊర్జేదధాతన మహేరణాయచక్షుసే యోవశ్శివతమోరసః తస్యభాజయతేహనః ఉశతీరివమాతరః తస్మారంగమామవః యస్యక్షయాయ జిన్వధ అపోజనయధాచనః

శ్రీ మహా గణాధిపతయే నమః పంచమృతస్నానం సమర్పయామి .

శ్లోగంగాది సర్వ తీర్దేభ్యః ఆహృతైరమలైర్జలైః
స్నానం కరిష్యామి భగవాన్‌ ఉమాపుత్ర నమోస్తుతే
శ్రీ మహా గణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి , శుద్ధ ఆచమనీయం సమర్పయామి .

(ఇక్కడ అవకాశమునుబట్టి రుద్రసూక్తనుతో అభిషేకము చేయవలెను.) 

(Vastram) వస్తము::>>

ఓం విఘ్నరాజాయ నమః
తం యజ్ఞం బర్‌హిషి ప్రౌక్షన్ పురుషం జాత మగ్రతః తేన దేవా అయజంత సాధ్యాఋషయశ్చయే

శ్లో రక్త వస్త్రద్వయం చారు దేవ యోగ్యంచ మంగళం
శుభప్రదం గృహాణ త్వం లంబోదర హరాత్మజ
శ్రీ మహా గణాధిపతయే నమః వస్త్ర యుగ్మం సమర్పయామి.

(Yagnopaveetham) యజ్ఞోపవీతము::>>

 ఓం గణాధిపాయ నమః
తస్మా ద్యజ్ఞా త్సర్వ హుతః సంబృతం పృషదాజ్యం
పశుగ్‌స్తాగ్‌శ్చక్రే వాయవ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చయే

రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకం
గృహాణ దేవ ధర్మజ్ఞ భక్తానామిష్ట దాయకః
శ్రీ మహా గణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి.

(Gandham - Sandle Wood) గంధము::>> ఓం ధూమకేతవే నమః

తస్మా ద్యజ్ఞాత్సర్వహుతః ఋచ స్సామాని జిజ్ఞిరే ఛందాగ్ంసి జిజ్ఞిరే తస్మాత్ యజు స్తస్మా దజాయత

శ్లో చందనాగురు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సుర శ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం
శ్రీ మహా గణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి.తిలకధారణం సమర్పయామి.

(Davala Akshata - White rice) ధవళాక్షతలు::>>

అక్షతాన్‌ ధవళాన్‌ దివ్యాన్ శాలీ యాన్ స్తండులాన్
శుభాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే
శ్రీ మహా గణాధిపతయే నమః అక్షతాన్‌ సమర్పయామి.

(Pushpam - Flower)  పుష్పము::>>

ఓం గణాధ్యక్షాయ నమః

తస్మాదశ్వా అజాయంత \ యేకేచో భయాదతః గావోహ జిజ్ఞిరే తస్మాత్ తస్మా జ్జాతా అజావయః

సుగంధాని సుపుష్పాణి, జాజీకుంద ముఖానిచ
ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే
శ్రీ మహా గణాధిపతయే నమః పుష్పాణి పూజయామి.

(Adhanga Puja)  అధ అంగ పూజ ::>>

(వినాయకుని ప్రతి అంగము పుష్పములతో పూజించవలెను)

ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి " పాదములు "

ఓం ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి " మడిమలు "

ఓం శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి " మోకాళ్లు "

ఓం విఘ్న రాజాయ నమః జంఘే పూజయామి " పిక్కలు "

ఓం అఖువాహనాయ నమః ఊరూ పూజయామి " తొడలు "

ఓం హేరంభాయ నమః కటిం పూజయామి " పిరుదులు "

ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి " బొజ్జ "

ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి " బొడ్డు "

ఓం గణేశాయ నమః హృదయం పూజయామి " రొమ్ము "

ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి " కంఠం "

ఓం స్కందాగ్రజాయ నమః స్కంథౌ పూజయామి " భుజములు "

ఓం పాషస్తాయ నమః హస్తౌ పూజయామి " చేతులు "

ఓం గజ వక్త్రాయ నమః వక్త్రం పూజయామి " ముఖము "

ఓం విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి " కన్నులు "

ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి " చెవులు "

ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి " నుదురు "

ఓం సర్వేశ్వరాయ నమః " తల "

ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి " శరీరం "

(Eka Vimshathi Puja) ఏకవింశతి పత్రపూజ::>>

(21 విధముల పత్రములతో పూజింపవలెను)
సుముఖాయనమః--మాచీపత్రం--పూజయామి
గణాధిపాయ నమః--బృహతీపత్రం--పూజయామి
ఉమాపుత్రాయ నమః--బిల్వపత్రం--పూజయామి
గజాననాయ నమః--దుర్వాయుగ్మం--పూజయామి
హరసూనవేనమః--దత్తూరపత్రం--పూజయామి
లంబోదరాయనమః--బదరీపత్రం--పూజయామి
గుహాగ్రజాయనమః--అపామార్గపత్రం--పూజయామి
గజకర్ణాయనమః--తులసీపత్రం--పూజయామి
ఏకదంతాయ నమః--చూతపత్రం--పూజయామి
వికటాయ నమః--కరవీరపత్రం--పూజయామి
భిన్నదంతాయ నమః--విష్ణుక్రాంతపత్రం--పూజయామి
వటవేనమః--దాడిమీపత్రం--పూజయామి
సర్వేశ్వరాయనమః--దేవదారుపత్రం--పూజయామి
ఫాలచంద్రాయ నమః--మరువకపత్రం--పూజయామి
హేరంబాయనమః--సింధువారపత్రం--పూజయామి
శూర్పకర్ణాయనమః--జాజీపత్రం--పూజయామి
సురాగ్రజాయనమః--గండకీపత్రం--పూజయామి
ఇభవక్త్రాయనమః--శమీపత్రం--పూజయామి
వినాయకాయ నమః--అశ్వత్థపత్రం--పూజయామి
సురసేవితాయ నమః--అర్జునపత్రం--పూజయామి
కపిలాయ నమః--అర్కపత్రం--పూజయామి
శ్రీ గణేశ్వరాయనమః--ఏకవింశతి పత్రాణి--పూజయామి !!!

(Ashtothara Shatanama Puja) అష్టోత్తరశత నామ పూజ ::>>

(పుష్పములు ప్రతి అక్షతలు మొదలగు వానిచేఒక్కొక్క నామము చదివి వినాయకుణ్ణి పూజించవలెను )

( ప్రతి నామమునకు ముందుగా " ఓం శ్రీం గ్లౌం గం " అనియు
నామం--చివర " నమః " అనియు చదువవలెను.)


1)ఓం గజాననాయ నమః
2)ఓం గణాధ్యక్షాయ నమః
3)ఓం విఘ్నరాజాయ నమః
4)ఓం వినాయకాయ నమః
5)ఓం ద్వైమాతురాయ నమః
6)ఓం ద్విముఖాయ నమః
7)ఓం ప్రముఖాయ నమః
8)ఓం సుముఖాయ నమః
9)ఓం కృతినే నమః
10)ఓం సుప్రదీప్తాయ నమః
11)ఓం సుఖనిధయే నమః
12)ఓం సురాధ్యక్షాయ నమః
13)ఓం సురారిఘ్నాయ నమః
14)ఓం మహాగణపతయే నమః
15)ఓం మాన్యాయ నమః
16)ఓం మహాకాలాయ నమః
17)ఓం మహాబలాయ నమః
18)ఓం హేరంబాయ నమః
19)ఓం లంబజఠరాయ నమః
20)ఓం హయగ్రీవాయ నమః
21)ఓం ప్రథమాయ నమః
22)ఓం ప్రాజ్ఞాయ నమః
23)ఓం ప్రమోదాయ నమః
24)ఓం మోదకప్రియాయ నమః
25)ఓం విఘ్నకర్త్రే నమః
26)ఓం విఘ్నహంత్రే నమః
27) ఓం విశ్వనేత్రే నమః
28)ఓం విరాట్పతయే నమః
29)ఓం శ్రీపతయే నమః
30)ఓం వాక్పతయే నమః
31)ఓం శృంగారిణే నమః
32)ఓం ఆశ్రితవత్సలాయ నమః
33)ఓం శివప్రియాయ నమః
34)ఓం శీఘ్రకారిణే నమః
35)ఓం శాశ్వతాయ నమః
36)ఓం బల్వాన్వితాయ నమః
37)ఓం బలోద్దతాయ నమః
38)ఓం భక్తనిధయే నమః
39)ఓం భావగమ్యాయ నమః
40)ఓం భావాత్మజాయ నమః
41)ఓం అగ్రగామినే నమః
42)ఓం మంత్రకృతే నమః
43)ఓం చామీకర ప్రభాయ నమః
44)ఓం సర్వాయ నమః
45)ఓం సర్వోపాస్యాయ నమః
46)ఓం సర్వకర్త్రే నమః
47)ఓం సర్వ నేత్రే నమః
48)ఓం నర్వసిద్దిప్రదాయ నమః
49)ఓం పంచహస్తాయ నమః
50)ఓం పార్వతీనందనాయ నమః
51)ఓం ప్రభవే నమః
52)ఓం కుమార గురవే నమః
53)ఓం కుంజరాసురభంజనాయ నమః
54)ఓం కాంతిమతే నమః
55)ఓం ధృతిమతే నమః
56)ఓం కామినే నమః
57)ఓం కపిత్థఫలప్రియాయ నమః
58)ఓం బ్రహ్మచారిణే నమః
59)ఓం బ్రహ్మరూపిణే నమః
60)ఓం మహోదరాయ నమః
61)ఓం మదోత్కటాయ నమః
62)ఓం మహావీరాయ నమః
63)ఓం మంత్రిణే నమః
64)ఓం మంగళసుస్వరాయ నమః
65)ఓం ప్రమదాయ నమః
66)ఓం జ్యాయసే నమః
67)ఓం యక్షికిన్నరసేవితాయ నమః
68)ఓం గంగాసుతాయ నమః
69)ఓం గణాధీశాయ నమః
70)ఓం గంభీరనినదాయ నమః
71)ఓం వటవే నమః
72)ఓం జ్యోతిషే నమః
73)ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
74)ఓం అభీష్టవరదాయ నమః
75)ఓం మంగళప్రదాయ నమః
76)ఓం అవ్యక్త రూపాయ నమః
77)ఓం పురాణపురుషాయ నమః
78)ఓం పూష్ణే నమః
79)ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః ?
80)ఓం అగ్రగణ్యాయ నమః
81)ఓం అగ్రపూజ్యాయ నమః
82)ఓం అపాకృతపరాక్రమాయ నమః
83)ఓం సత్యధర్మిణే నమః
84)ఓం సఖ్యై నమః
85)ఓం సారాయ నమః
86)ఓం సరసాంబునిధయే నమః
87)ఓం మహేశాయ నమః
88)ఓం విశదాంగాయ నమః
89)ఓం మణికింకిణీ మేఖలాయ నమః
90)ఓం సమస్తదేవతామూర్తయే నమః
91)ఓం సహిష్ణవే నమః
92)ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
93)ఓం విష్ణువే నమః
94)ఓం విష్ణుప్రియాయ నమః
95)ఓం భక్తజీవితాయ నమః
96)ఓం ఐశ్వర్యకారణాయ నమః
97)ఓం సతతోత్థితాయ నమః
98)ఓం విష్వగ్దృశేనమః
99)ఓం విశ్వరక్షావిధానకృతే నమః
100)ఓం కళ్యాణగురవే నమః
101)ఓం ఉన్మత్తవేషాయ నమః
102)ఓం పరజయినే నమః
103)ఓం సమస్త జగదాధారాయ నమః
104)ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
105)ఓం ఆక్రాంతచిదచిత్రకాశాయ నమః
106)ఓం విఘాతకారిణే నమః
107)ఓం భక్తజీవితాయ నమః
108)ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
నానావిధ పరిమళ పత్రపుష్పాక్షితైః పూజాం సమర్పయామి .

(Adha Durvayugma Puja) << అధ దూర్వయుగ్మ పూజ >>

(ఈ పదినామములు చదువుచు ప్రతి నామమునకు "దూర్వయుగ్మ" అనగా రెండేసి గరిక పోచలు సమర్పింపవలెను )

ఓం గణాధిపాయ నమః --- దూర్వయుగ్మం పూజయామి
ఓం ఉమా పుత్రాయ నమః --- దూర్వయుగ్మం పూజయామి
ఓం ఆఖువాహనాయ నమః --- దూర్వయుగ్మం పూజయామి
ఓం వినాయకాయ నమః --- దూర్వయుగ్మం పూజయామి
ఓం ఈశపుత్రాయ నమః --- దూర్వయుగ్మం పూజయామి
ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః --- దూర్వయుగ్మం పూజయామి
ఓం ఏకదంతాయ నమః --- దూర్వయుగ్మం పూజయామి
ఓం ఇభ వక్ర్తాయ నమః --- దూర్వయుగ్మం పూజయామి
ఓం మూషిక వాహనాయ నమః --- దూర్వయుగ్మం పూజయామి
ఓం కుమార గురవే నమః --- దూర్వయుగ్మం పూజయామి

శ్రీ మహా గణాధిపతయే నమః --- దూర్వయుగ్మం పూజాం సమర్పయామి.

(Dhupam) ధూపము::>>

 ( అగరవత్తులు చూపి ఈ మంత్రమును చదువవలెను )

ఓం పాలచంద్రాయ నమః

యత్పురుషం వ్యదధుః కతిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌభాహూ కావూరూ పాదా వుచ్యేతే

శ్లో దశాంగం గుగ్గిలోపేతం సుగంధం సుమనోహరం
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ
శ్రీ మహా గణపతయే నమః ధూప మాఘ్రాపయామి.

(Deepam) దీపము::>> 

(దీపమును చూపుతూ దీపముపై అక్షంతలు వేయుచు ఈ క్రింద మంత్రము చదువవలెను)

ఓం గజననాయ నమః

బ్రాహ్మణ్యో௨స్య ముఖ మాసీత్ బాహూ రాజన్యః కృతః ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగ్ం శోద్రో అజాయత

శ్లో సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం ఉమాపుత్ర నమోస్తుతే
శ్రీ మహా గణాధిపతయే నమః దీపం దర్శయామి.
ధూప దీపానంతరం శుద్ధ ఆచననీయం సమర్పయామి.

(Nyvedyam) నైవేద్యము::>>

ఓం వక్రతుండాయ నమః

చంద్రమా మనసో జాతః చక్షోస్సూర్యో అజాయత ముఖదింద్ర శ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయు రజాయత

శ్లో సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్‌ ఘృతపాచితాన్‌
నైవేద్యం గృహ్యతాం దేవ చిణముద్గః ప్రకల్పితాన్‌
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చోష్యం పానీయ మేవచ
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక

ఓంభూర్భూవస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిషించామి
( సూర్యాస్తమయము తరువత " ఋతంత్వర్తేన పరిషించామి " అని చెప్పవలెను. )

అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహా గణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణయస్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఉదానాయ స్వాహా ఓం సమనాయ స్వహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్-రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి

శ్రీ మహా గణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి.

(Thambulam) తాంబూలం::>>

ఓంశూర్పకర్ణాయ నమః
నాభా ఆసీ దంతరిక్షం శీర్షోద్యౌ స్సమవర్తత పద్భ్యాగ్ం భూమిర్దిశ శ్శ్రోత్రాత్ తధాలోకాగ్ం అకల్పయన్

శ్లో పూగీఫలం సంయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం
శ్రీ మహా గణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి.

(Neerajanam)  నీరాజనం::>>

 ఓం హేరంబాయ నమః

( కర్పూర హారతి ఇచ్చుచు ఈ మంత్రమును చదువవలెను )

సప్తాస్యాసన్ పరిధయః త్రిస్సప్త సమిధః కృతాః దేవా యద్యజ్ఞం తన్వనాః అబధ్నన్ పురుషం పశుం

శ్లోఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్థితం
నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ
శ్రీ మహా గణాదిపతయే నమః నీరాజనం సమర్పయామి.
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.

ఇక్కడ మంత్రపుష్పం చదువవలెను )

గణాధిపనమస్తేస్తు ఉమాపుత్ర గజానన వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక ఏకదంతం ఇభవదన తధా మూషిక వాహన కుమార గురవే తుభ్యం అర్పయామి సుమాంజలీం

శ్లోఅర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక
గంధ పుష్పాక్షతైరుక్తం పాత్రస్థం పాపనాశన

శ్రీ గణాధిపతయే నమః పునరర్ఘ్యం సమర్పయామి.

సతతం మోదకప్రియం నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్నాశన
శ్రీ మహా గణాధిపతయే నమః ప్రదక్షణం నమస్కారాన్ సమర్పయామి.

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసాతధా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగ ఉచ్యతే

శ్రీ మహా గణాధిపతయే నమః సాష్టంగ నమస్కారాన్ సమర్పయామి

చత్ర చామర గీత నృత్య ఆందోళికా అశ్వారోహణ
గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి.

( పుష్పములు సమర్పించవలెను )

యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిఘు
న్యూన్యం సంపూర్నతాం యాతి సద్యో వందే వినాయక

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయకం
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే

అనయా యధాశక్తి పూజయా భగవాన్ సర్వాత్మకః
శ్రీ సిద్ధి వినాయక సుప్రసన్నః సుప్రితో వరదో భవతు

శ్రీ మహా గణాధిపతయే దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి


<<< విఘ్నేశ్వరుని కథాప్రారంభము >>> (Vinayaka Chavithi Story)

Legend of Vinayaka Chavithi in Telugu

సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరోత్పత్తియను, చంద్ర దర్శన దోష నివారణంబును చెప్ప నారంభించెను.

పూర్వ కాలమందు గజాసురుడు అను రాక్షసుడు శివుని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. అతని తపః ప్రభావంతో పరమశివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి 'నీవు ఎల్లప్పుడు నా ఉదరంలో నివసించాలి' అని కోరుకున్నాడు. శివుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుని ఉదరంలో ప్రవేశించాడు. అప్పుడు కైలాసంలో ఉన్న నంది, భృంగి, వీర భద్రాదులు, ప్రమధ గణాలకు ఈశ్వరదర్శనం లభించకపోవడంతో ఈశ్వరుడి భార్య ఐన పార్వతి వద్దకు వెళ్ళారు. దీంతో పార్వతి భర్తజాడ తెలియక చింతించింది. కొంతసేపటి తర్వాత పార్వతి ప్రమధగణాలతో కలసి విష్ణుమూర్తి వద్దకు వచ్చింది. అప్పుడు విష్ణుమూర్తి పార్వతీదేవి బాధను నివారించడానికి శివుని వెదకుతూ చివరకు శివుడు గజాసురుని గర్భంలో ఉన్నట్లు తెలుసుకుని, గజాసురిడి గర్భంనుంచి పరమేశ్వరుడిని బయటకు రప్పించడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. శివుని వాహనమైన నంది'ని అలంకరించి బహ్మ, తదితర దేవతలతో కలసి రకరకాల వేషాలతో గజాసురుని పురానికి వెళ్ళారు. అప్పుడు ఆ పట్టణంలో నందిచేత నాట్యం చేయిస్తుండగా గజాసురుడు వారిని తనవద్దకు పిలిపించాడు. అక్కడవారు పలు విధాలుగా, నందిచేత నాట్యం చేయించగా, గజాసురుడు ఆనాట్యాన్ని చూసి గొప్ప ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పొందాడు. బ్రహ్మ, విష్ణువులు మారువేషాల్లో ఉన్నట్లు గుర్తించలేక వారితో 'మీకేం వరం కావాలో' కోరుకోమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఈ నంది ఈశ్వరుని వాహనమని తెలిపి, అతని గర్భంలో ఉన్న మహేశ్వరుడిని తమకు అప్పగించాలని కోరారు. అప్పుడు గజాసురుడికి ఆ నందితో ఉన్న వారంతా బ్రహ్మ, విష్ణు తదితర దేవతలని తెలుసుకున్నాడు. దీంతో ఇక తనకు చావు తప్పదని నిర్ధారించుకున్నాడు. అందుకే తన ముఖానికి శాశ్వతత్వాన్ని ప్రసాదించమని దేవతలను కోరాడు. అప్పుడు దేవతలు గజాసురుని సంహరించడానికి నందిని ప్రేరేపించారు. అప్పుడు నందిని తన కొమ్ములతో గజాసురుని వక్షస్థలాన్ని చీల్చి, అతన్ని సంహరించింది. అప్పుడు ఈశ్వరుడు గజాసురుని నుంచి బయటకొచ్చాడు. ఆతర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి, బ్రహ్మ సత్యలోకానికి, మిగిలిన దేవతలు వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. ఈశ్వరుడు గజాసురుని శిరస్సును చేతితో పట్టుకుని, కైలాసానికి బయల్దేరాడు.

<<< వినాయక జననం >>> (Birth of Vinayaka)

కైలాసంలో ఉన్న పార్వతీదేవి తన భర్త అయిన ఈశ్వరుడు గజాసురుడి నుంచి బయటపడి కైలాసానికి వస్తున్నట్లుగా తెలుసుకుంది. ఎంతగానో సంతోషించింది. అభ్యంగన స్నానం చేయడానికి వెళుతూ నలుగు పిండితో ఒక బాలుడి బొమ్మను చేసి, ప్రాణం పోసి, వాకిలి వద్ద కాపలా ఉంచి, స్నానానికి వెళ్ళింది. ఆ సమయంలో గజాసురుని ముఖాన్ని చేత్తో పట్టుకుని శివుడు వెండి కొండ వద్దకు వచ్చాడు. వాకిలి దగ్గర కాపలాగా ఉన్న బాలుడు శివుని అడ్డగించాడు. తీవ్రమైన కోపంతో శివుడు ఆ బాలుడిని సంహరించి, లోపలికి వెళ్ళాడు. ఆతర్వాత పార్వతీ దేవి తలంటు స్నానం చేసి, సర్వాభరణ భూషితురాలై భర్త అయిన ఈశ్వరుడి వద్దకు వచ్చి సంతోషంతో మాట్లాడింది. వారి మాటల సమయంలో శివుడు వాకిట్లో తనను అడ్డగించిన బాలుని తాను సంహరించినట్లు చెప్పాడు. బాలుడి మరణవార్త విని, పార్వతి దుఃఖిస్తుండగా ఈశ్వరుడు పార్వతిని ఓదార్చి తాను తెచ్చిన గజాసురుని ముఖాన్ని బాలుడి మొండేనికి అతికించి ప్రాణం పోశాడు. పార్వతి ఎంతగానో సంతోషించింది. ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుడిని కుమారుడిగా స్వీకరించి, అతనికి ఎలుకను వాహనంగా ఇచ్చి సుఖంగా సంచరించమని దీవించారు. కొంతకాలానికి వారికి కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానాయకుడై విరాజిల్లాడు.

ఒకనాడు దేవతలు, మునులు, పరమేశ్వరుని దర్శించి, విఘ్నాలకు ఒకరిని అధిపతిగా చేయమని కోరారు. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు కనుక ఆ ఆధిపత్యాన్ని తనకు ఇవ్వమని, కుమారస్వామి తండ్రిని వేడుకొన్నాడు. అప్పుడు శివుడు 'మీ ఇద్దరిలో ఎవరు ముల్లోకాల్లోని పుణ్యనదులలో స్నానం చేసి, ముందుగా నావద్దకు వస్తారో వారికి ఆధిపత్యాన్ని ఇస్తా'నని చెప్పాడు. కుమారస్వామి వెంటనే తనవాహనమైన నెమలినెక్కి అతివేగంగా సంచరిస్తున్నాడు. అప్పుడు గజాననుడు ఖిన్నుడై తండ్రివద్దకు వచ్చి, నమస్కరించి 'ఓ తండ్రీ నా అసమర్థత తెలిసి కూడా ఇలాంటి అసాధ్యమైన పరీక్షను పెట్టారు కాబట్టి దానికి తగిన ఉపాయాన్ని కూడా చెప్పండని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు గజాననుడు ఆశీర్వదిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసినవాడు భూమండలానికి ప్రదక్షిణం చేసినంత ఫలితాన్ని పొందుతాడని, అలా చేయమని సూచించాడు. మూడు కోట్ల యాభై లక్షల నదులలో స్నానం చేసి, వస్తున్న కుమారస్వామికి ప్రతిచోటా తనకంటే ముందుగా స్నానం చేసివెళ్తున్న గజాననుడు కనిపించాడు. కుమారస్వామి తన ఓటమిని అంగీకరించి, తండ్రివద్దకు వచ్చి అన్నగారికే విఘ్న ఆధిపత్యాన్ని ఇవ్వాలని కోరాడు. అప్పుడు పరమేశ్వరుడు గజాననుడికి విఘ్న నాయకుడిగా ఆధిపత్యాన్నిచ్చాడు. ఆనాడు భాద్రపద శుద్ధచవితి. ఆనాడు వినాయకునికి కుడుములు, ఉండ్రాళ్ళు ఇచ్చి పూజించిన జనాలకు అన్ని విఘ్నాలు తొలగిపోతాయని శివుడు వరమిచ్చాడు. భక్తులిచ్చిన కుడుములు ఉండ్రాళ్ళు తిని, కైలాసానికి వచ్చి తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ శ్రమపడుతున్న విఘ్నేశ్వరుని చూసి, చంద్రుడు వికటంగా నవ్వాడు. చంద్రుని దృష్టితగిలి వినాయకుని ఉదరం పగిలింది. మరణించిన విఘ్నేశ్వరుని చూసి పార్వతి దుఃఖించి 'నిన్నుచూసిన జనులు పాపాత్ములై నిందలు పొందుదురు గాక' అని శపించింది.

<<< ఋషి పత్నులకు నీలాపనింద కలుగుట >>>

పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తర్షులు భార్యలతోకలసి, యజ్ఞం చేస్తూ అగ్ని దేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు రుషి పత్నుల మీద మోహం పొంది, శాపభయంతో క్షీణింపసాగాడు. అగ్ని దేవుని భార్య అయిన స్వాహాదేవి, తానే రుషిపత్నుల రూపాలను పొంది అగ్నిదేవుడిని చేరింది. రుషులు అగ్ని దేవునితో ఉన్నది తమ భర్యలేనని భ్రాంతిచెంది, వారిని విడిచిపెట్టారు. పార్వతి శాపంవల్ల రుషిపత్నులు చంద్రుని చూట్టం వల్ల అపనిందను పొందారని, దేవతలు తెలుసుకుని, బ్రహ్మదేవునితో కలసి, కైలాసానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు మరణించి, పడివున్న విఘ్నేశ్వరుడిని తిరిగి బతికించాడు. తర్వాత పార్వతిదేవితో 'అమ్మా నీవు చంద్రునికిచ్చిన శాపం వల్ల ఆపద కలిగినది కాబట్టి దాన్ని ఉపసంహరించ'మని కోరాడు. అప్పుడు పార్వతీదేవి తిరిగి బతికిన తన కుమారుడిని ప్రేమతో దగ్గరకు తీసుకుని, 'ఏరోజున విఘ్నేశ్వరుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆరోజు చంద్రుని చూడకూడదని శాపాన్ని సవరించింది. అప్పటినుంచి అందరూ భాద్రపద శుద్ధచవితినాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తతో ఉండి, సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది.

<<< శమంతకోపాఖ్యానం >>> (Story of Shamantaka)

ద్వాపరయుగంలో ద్వారక నివాసి అయిన శ్రీకృష్ణుడిని నారదుడు దర్శించి ప్రియసంభాషణల జరుపుతూ 'స్వామీ! ఈ రోజు వినాయకచవితి కనుక పార్వతి శాపం కారణంగా చంద్రుడిని చూడకూడదు, కనుక నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి, నారదుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ రోజు రాత్రి చంద్రుడిని ఎవరూ చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. ఆనాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీర ప్రియుడు కావడంచేత ఆకాశం వంక చూడకుండానే, ఆవుపాలను పితుకుతూ పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దీంతో నాకెలాంటి అపనింద రానుందోనని చింతించాడు. కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యుడి వరంచేత శమంతకమణిని సంపాదించి, ద్వారకకు శ్రీకృష్ణుని చూడడానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు మర్యాద చేసి ఆ మణిని తనికిమ్మని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు ఇదిరోజుకి ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తుందని, అలాంటి దీన్ని ఏ మందమతి కూడా మరొకరికి ఇవ్వడని పలికి కృష్ణుని కోరికను తిరస్కరించాడు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతక మణిని మెడలో ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళాడు. అప్పుడు ఒక సింహం ఆ మణిని చూసి మాంసఖండమని భ్రమించి, వానిని చంపి ఆ మణిని తీసుకొని పోతుండగా ఒక ఎలుగుబంటు (జాంబవంతుడు) ఆ సింహాన్ని చంపి, ఆ శమంతక మణిని తన కొండగుహలో ఉన్న తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్తను విని శ్రీకృష్ణుడు మణిని ఇవ్వలేదని తన సోదరుడిని చంపి రత్నాన్ని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అదివిని ఆ రోజు (భాద్రపద శుద్ధ చవితి) చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తనమీద నింద పడిందని గ్రహించాడు. శమంతక మణిని వెదకుతూ అడవికి వెళ్లగా ఒకచోట ప్రసేనుని మృత శరీరాన్ని చూశాడు. అక్కడ సింహపు అడుగు జాడలు ఆయనకు కనిపించాయి. ప్రసేనుడు సింహం వల్ల మరణించాడని శ్రీకృష్ణుడు గ్రహించాడు. ఆతర్వాత భల్లూక చరణ విన్యాసం కనిపించింది. దాన్ని అనుసరించి వెళ్ళి ఒక పర్వతగుహలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టినమణిని చూసి, దానిని తీసుకుని, బయటకు రాసాగాడు. అక్కడున్న బాలిక ఏడ్వసాగింది. అంత దాది ఎవరో వచ్చారని కేకపెట్టింది. అప్పుడు జాంబవంతుడు మిక్కిలి కోపంతో శ్రీకృష్ణునిపైబడి అరుస్తూ అతనితో యుద్ధానికి దిగాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులుయుద్ధం జరిగింది. జాంబవంతుడి శక్తి క్షీణించింది. తనతో ద్వంద్వ యుద్ద చేసినవాడు రావణాసురిని చంపిన శ్రీరామచంద్రునిగా తెలుసుకున్నాడు. ఆశ్రీరాముడే ఈ శ్రీకృష్ణుడని గ్రహించాడు. తాను త్రేతాయుగంలో శ్రీరాముని కోరిన కోర్కెను శ్రీకృష్ణుడు తనతో యుద్ధం చేసి, తీర్చుకున్నాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి, శమంతకమణితోపాటు తన కుమార్తె అయిన జాంబవతినికూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని సత్రాజిత్తునకు ఇచ్చాడు. సత్రాజిత్తు జరిగిన యధార్థాన్ని తెలుసుకొని తన తప్పు మన్నించమని శ్రీకృష్ణుని ప్రార్థించి, తన కుమార్తె అయిన సత్యభామను, కృష్ణునికిచ్చి వైభవంగా వివాహంచేసి, శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించాడు. ఆసమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడ్ని ప్రార్థించి మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి? అని ప్రార్థింపగా శ్రీకృష్ణుడు దయామయుడై భాద్రపద శుద్ధ చవితినాడు యధావిధిగా వినాయకుని పూజించి ఈ 'శమంతకోపాఖ్యానాన్ని' విని అక్షతలు తలపై ధరించిన వారికి ఆ నాడు ప్రమాదవశాత్తు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలుగవు అని పలికాడు. అనాటి నుండి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్దచవితినాడు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తికి తగ్గినట్లుగా గణపతిని పూజించి తాముకోరిన కోరికలు తీర్చుకొన్నారు.

ఈ కధను చదివిన గాని --- వినినగాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి.

మీ శక్తికి తగ్గట్లుగా పూజించి స్తోత్రించి , గుంజిళ్ళుతీసి , నమస్కారము చేయవలెను.

!! సర్వేజనా స్సుఖినో భవంతు !!